Tuesday 24 June 2014

ఓరుగల్లుకు లక్కవరం

ప్రకృతి ప్రేమగా చెక్కిన అందం...
నలుకొండల ఒడిలో..
గలగలాపారుతున్న సెలయేటి ప్రవాహంతో..
పక్షుల కిలకిలారావాలతో..
ప్రతీ హృదయం స్పందించే స్థలం..
కాకతీయుల సాంకేతిక పరిజ్ఞానానికి మెచ్చుతునక..
లెక్కలేని అందాలు ఇముడ్చుకున్న ఒక అద్భుతం.. లక్నవరం!

zindagi2 
వరంగల్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో ఏటూర్‌నాగారం రహదారిలో ఉన్న బుస్సాపూర్ గ్రామపరిధిలో లక్నవరం సరస్సు కనువిందు చేస్తుంది. బుస్సాపూర్ గ్రామం నుంచి సుమారు 5 కిలోమీటర్లు ఘాట్‌రోడ్‌లో ప్రయాణించి లక్నవరం చేరుకోవచ్చు. మెలికలు తిరిగిన దారిగుండా ప్రయాణిస్తూ మట్టికోటలాంటి నిర్మాణానికి చేరుకోగానే సరస్సు ఒక్కసారిగా కనిపించడం ఇక్కడ ప్రత్యేకత! ఒకరకంగా చెప్పాలంటే దీన్ని ‘రహస్య చెరువు’గా చెప్పుకోవచ్చు. పచ్చటిదుప్పటి కప్పుకున్న కొండల నడుమ తొమ్మిది ద్వీపసమూహాలతో నయనానందకరంగా కనిపిస్తుంది. నగర కాలుష్యానికి అలవాటు పడిన ప్రతి ఒక్కరినీ ఇక్కడి వాతావరణం మరోలోకానికి తీసుకుపోతుంది. నిశ్చలంగా ఉన్న నీటిని, నిర్మలమైన పరిసరాలను ఆస్వాదించడమొక్కటే మనం చేయాల్సిన పని!

జీవధార...

zindagi4 
లక్నవరం చెరువు నిర్మాణం కాకతీయులకాలం నాటిదే. వారి శిల్పకళానైపుణ్యమే కాదు వ్యవసాయం కూడా ఘనమైనదే! అనువైనచోట నిర్మాణాలు చేపట్టడంలో కాకతీయులది అందెవేసిన చెయ్యి. తటాకాల నిర్మాణానికి సృజనాత్మకశక్తిని నమ్ముకున్న ఆనవాళ్లు కనిపిస్తాయి. ఎత్తైన కొండల్ని ఆసరాగా చేసుకొని లక్నవరం చెరువును తవ్వించారు. కాకతీయుల వంశపాలకులు గణపతిదేవుడు చేపట్టిన ఈ నిర్మాణం వల్ల అప్పటి ప్రజలకు లక్నవరం జీవధారగా మారింది. ఇప్పటికే వేలాది హెక్టార్లకు సాగునీరు అందిస్తూనే ఉంది. లక్నవరం మేడారం జాతరకు వచ్చే భక్తులను పునీతం చేస్తున్నది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే అతిపెద్ద గిరిజన జాతర కోసం జంపన్నవాగు ద్వారా ప్రవహించే నీటితో భక్తులు పవివూతస్నానం చేయడం ఆనవాయితీ. ఆ జంపన్నవాగుకు జీవాధారం లక్నవరమే!

తరగని పర్యాటక సంపద...

zindagi5 
ఇక్కడి పర్యాటక సంపదను చూసిన రాష్ట్రపర్యాటక శాఖ మూడు కోట్లరూపాయలతో పలు నిర్మాణాలు చేపట్టింది. తెలంగాణ ప్రాంతంలో ఇంత పెద్దబడ్జెట్‌తో నిర్మాణాలు చేయడం తొలిసారి. స్థానిక, స్థానికేతరులు అధికంగా సందర్శిస్తున్న ప్రాంతం కూడా ఇదే కావడం వల్ల లక్నవరానికి పర్యాటక కళ రోజురోజుకూ పెరుగుతున్నది. లక్నవరం సరస్సుకు చిన్నచిన్న ద్వీపాల్లాంటి సమూహాలు ప్రత్యేక ఆకర్షణ! ఒక్కో ద్వీపవూపాంతం ఒక కి.మీ నుంచి 3కి.మీ. చుట్టుకొలత కలిగి రమణీయంగా కనిపిస్తుంది. పర్యాటకశాఖవారు నడుపుతున్న బోటులో విహరిస్తుంటే మలేషియాదీవుల్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. నిశబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చే చల్లనిగాలి స్పర్శ గిలిగింతలు పెడుతుంది. బోటులో వెళుతుంటే ఒక్కో ద్వీపం ఒక్కో ఆకారంలో కనిపిస్తుంది. వీటిలో ఔషధ గుణాలున్న చెట్లు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలోని వనమూలికలతో ఆయుర్వేద వైద్యశాల నిర్మించుకోచ్చు. ప్రకృతివైద్యానికి ఇది అనువైన ప్రాంతంగా ఉంటుందని పర్యాటకశాఖ సైతం భావిస్తున్నది.

ఊయల వంతెన...

zindagi3లక్నవరంలో మానవనిర్మిత ఊయల వంతెన(సస్పెన్షన్ బ్రిడ్జి) ప్రత్యేక ఆకర్షణ! భారతదేశంలో అతిపెద్ద సస్పెన్షన్ బ్రిడ్జిలో ఒకటిగా దీన్ని నిర్మించారు. 180మీటర్ల పొడవుతో కాకరకాయల బోడుగా పిలుపుచుకునే దీవి వరకు ఇది ఉంటుంది. 2006లో పర్యాటక శాఖ 40లక్షల రూపాయలతో ఈ వంతెన నిర్మాణం చేపట్టింది. కేరళకు చెందిన వంతెన నిర్మాణ నిపుణుడు భరద్వాజ్ పర్యవేక్షణలో దీని నిర్మాణం జరిగింది. ఈ ఊయల వంతెనపై నడవడం పర్యాటకులకు ప్రత్యేక అనుభూతి! ఏకకాలంలో వందల మంది నడిచినా లయబద్దంగా ఊగే ఈ వంతెనపై పదేపదే నడవడాన్ని పిల్లలు, పెద్దలు ఆస్వాదిస్తారు. కాకరకాయల బోడులోని పర్యాటకశాఖ కాటేజీలను చేరుకోవాలంటే ఈ బ్రిడ్జి మీదుగానే వెళ్లాలి.

ఆంగ్ల అక్షరం ‘వి’ ఆకారంలో ఉండే బ్రిడ్జి మధ్యలో ‘వ్యూ పాయింట్’ ఉంది. అక్కడి నుంచి సరస్సు అందాలు చూస్తూ తమను తాము ఫోటోల ద్వారా బంధించుకోవడం పర్యాటకుల నిత్యకృత్యం. మీదగ్గర కెమెరా లేకున్నా ఐదు నిమిషాలలో ఫోటో అందించే ఫోటోక్షిగాఫర్లూ ఇక్కడే ఉంటారు. కాకరకాయల బోడుపై పర్యాటకసంస్థ నిర్వహిస్తున్న హరిత హోటల్ ఉంది. 7రూమ్‌లు, ఒక రెస్టాంట్ ఉందక్కడ! ఒక్కో గదికి ఒక రోజుకు రూ.1470 ఛార్జీ చేస్తారు. సాధారణ పర్యాటకులకు అల్పాహారం, భోజనం కూడా లభిస్తాయి. సరస్సు మధ్యలో అద్దాల గదిలో ఉండే రెస్టాంట్‌లో భోజనప్రియులు చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తూ భోజనం ఆరగించొచ్చు. దూరంగా ఉన్న మరో ప్రాంతంలో రెండు ప్రత్యేక కాటేజీలు నిర్మించారు. పూర్తిగా విదేశీ(మలేషియా) గడ్డితో నిర్మించిన కాటేజీలు ప్రత్యేకంగా ఉంటాయి. పైకప్పుకు ప్రత్యేకమైన గడ్డి ఉండడం వల్ల గ్రామీణ వాతావరణంలా అనిపిస్తుంది. పైగా అనేక ఏళ్లు చెక్కుచెదరకుండా ఉంటుందట. లక్నవరం గదుల బుకింగ్ కోసం ఏపీటీడీసీ వారి వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. బోటింగ్ మాత్రం నిత్యం ఉంటుంది. ఊయల వంతెనపైకి రావాలంటే పెద్దలకైతే రూ.10, పిల్లలకు రూ.5 చెల్లించాలి.


అమృతానుభవం...


ఆస్వాదించాలే గానీ ఇక్కడి అందాలకు కొదవలేదు! ఏటా ఆగస్టు నుంచి జనవరి వరకు లక్నవరంలో ప్రతీ ఉదయం, సాయంవూతాలు పర్యాటకులకు అమృతానుభవాలే. వర్షాకాలం నిండుకుండలా ఉండే జలాశయం. కొండలపై నుంచి జారిన ప్రతీ నీటి చుక్క సరస్సుకు చేరుకున్న ఆనవాళ్లు కొత్తగా కనిస్తాయి. ప్రత్యేకించి డిసెంబర్ నెలలో మంచుపొగల్ని చీల్చుకుంటూ వచ్చే సూర్యోదయం చలిలో రోమాంచితుల్ని చేస్తుంది. పరిచయమే లేని కొత్త దేశతీరాల్లో ఉన్నామనే భ్రమని కల్పిస్తుంది. బ్రహ్మ ఎంతో ప్రేమగా సృష్టించిన ప్రాంతం ఇదే కావచ్చు అనే అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. మరోవైపు సరస్సు మత్తడి అందాలు పర్యాటకులు కేరింతలు కొట్టేలా చేస్తాయి. ఊయల వంతెన నుంచి అరకి.మీ. దూరంలో మత్తడి నిర్మాణం, అక్కడి నుంచి మరో అర కిలోమీటరుదూరంలో తూము నిర్మాణాలు ఉన్నాయి. చెరువు నిండినప్పుడు తూము ద్వారా, మత్తడి ద్వారా ప్రవహించే నీరు పంటపొలాలకు చేరుకునేలా కాకతీయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

చారివూతక ఆనవాళ్లు..


కాకతీయులు చెరువులు నిర్మించిన ప్రతీచోట ఆలయ నిర్మాణాలు చేపట్టారు. కానీ లక్నవరం, పాఖాల సరస్సులను మాత్రం వ్యవసాయ కేంద్రాలుగానే భావించారని తెలుస్తున్నది. బుస్సాపూర్ గ్రామంలో, లక్నవరం అడవుల్లో చిన్న చిన్న గుడులు నిర్మించారు. కులదైవం రామలింగేశ్వరుణ్ణి ప్రతిష్ఠించిన ఆనవాళ్లు అక్కడ కనబడతాయి. కొన్ని శిథిలం కాగా, బుస్సాపూర్ ఆలయం మాత్రం పునర్నిర్మాణానికి అనువుగా ఉంది. పాడిపంటలు సమృద్ధిగా పండాలని కాకతీయులు కులదైవాన్ని కొలిచేందుకు ఈ నిర్మాణాలు చేపట్టినట్లు స్పష్టమవుతోంది. శిథిలమైపోతున్న ఆలయాలను పునరుద్ధరిస్తే లక్నవరానికి నిత్యం జలకళ ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

పర్యాటక సందడి...

zindagi6లక్నవరానికి వారాంతంలో పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుంది. వరంగల్ ప్రజలకు మంచి పిక్నిక్ స్పాట్! పాఠశాలలు, కళాశాలలు, కుటుంబాలు ప్రత్యేకంగా లక్నవరాన్ని సందర్శిస్తుంటాయి! గత ఏడాది జిల్లా నుంచి లక్నవరాన్ని 40 లక్షల మంది సందర్శించినట్లు పర్యాటకశాఖ లెక్కలు స్పష్టంచేస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో మేడారం జాతర జరగనుంది. ఈ నేపథ్యంలో లక్నవరాన్ని ఫిబ్రవరిలో 30 లక్షల పర్యాటకులు సందర్శిస్తారని పర్యాటకశాఖ అంచనా వేస్తోంది. లక్నవరం అతిపెద్ద పర్యాటక కేంద్రం అయినా సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులకు గురవుతున్నారు. జంగాలపల్లి, పస్రా రహదారిలో బుస్సాపూర్ గ్రామానికి మట్టిరోడ్డు మాత్రమే ఉంది. వర్షాలకు గుంతలు పడిపోవడంవల్ల ఈ దారిలో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. మరోవైపు ప్రచారలోపం వల్ల ఎక్కువమందికి లక్నవరం ప్రత్యేకతలు తెలియడంలేదు! రాష్ట్రస్థాయిలో పర్యాటకుల్ని ఇక్కడికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దీనివల్ల అక్కడి యువతకు, కుటుంబాలకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా లక్నవరంలో ప్రతీఏటా పదుల సంఖ్యలో సినిమా షూటింగ్‌లు జరుగుతూనే ఉన్నాయి. మరిన్ని వసతులు కల్పిస్తే సినిమాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

No comments:

Post a Comment