Tuesday 1 July 2014

జ్యోతిష్యంలో వింతలు, విడ్డూరాలు, అశాస్త్రీయాలు

ఖగోళ శాస్త్రం – జ్యోతిష్యం :

ఖగోళశాస్త్రం సైన్స్ లో భాగం. ఇందులో పరిశీలన, పరిశోధన ప్రధానంగా ఉంటాయి. ప్రాచీన కాలం నుండి ఈ ప్రక్రియ జరుగుతున్నది. కనుక క్రమేణా తెలుసుకునేది విస్తృతమౌతున్నది. పూర్వం తెలియని గ్రహాలు, నక్షత్రాలు, శకలాలు ఇలా ప్రకృతిలో ఎన్నో విషయాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ఇది ఇప్పటికి పరిమితంగా తెలిసింది. ఇంకా తెలియవలసింది అనంతంగా ఉన్నది. కనుక ఖగోళ శాస్త్రంలో ఏప్పుడూ నిత్య నూతనంగా విషయాలు తెలుస్తూనే ఉంటాయి. ఇందులో మరొక విశేషమేమిటంటే లోగడ తెలుగుకున్న వాటిలో దోషాలున్నా, అసంపూర్ణతలు ఉన్నా అవి దిద్దుకుంటూ పోవటం శాస్త్రియ ప్రక్రియలో ఒక ఉత్తమ గుణం. తన తప్పులను తాను సవరించుకుంటూ రుజువైన వాటిని అంగీకరిస్తూ, రుజువు కానివాటిని మూఢంగా నమ్మకుండా, రుజువుల కోసం ఎదురు చూడటం ఈ శాస్త్రంలో మంచి లక్షణం. ఇది సైన్స్ లో అన్ని విభాగాల్లోనూ ఉంటుంది. ఇందులో జ్యోతిష్యాలకు, ఊహలకూ, మనుషుల బలహీనతలను అట్టం పెట్టుకుని వ్యాపారం చేసే ధోరణి ఉండదు.

జ్యోతిష్యం భారత దేశం సొత్తు కాదు. ప్రపంచంలో అగ్రరాజ్యాలతో సహా అనేక చోట్ల ఇది ఉన్నది. భారతదేశంలో ప్రధానంగా మత, ధోరణిలో జోతిష్యం సాగింది. ఎక్కువగా పూర్వీకుల రచనలు, వాదనలు, ఆధారంగా జ్యోతిష్యం నడుస్తున్నది. మనుషులలో ఉన్న బలహీనతలు, నమ్మకాలు, పెట్టుబడిగా జ్యోతిష్యం వాడుకుంటున్నది. ఇందులో దోషాలు దిద్దుకోవటం, తప్పులు సవరించుకోవటం కనిపించదు. పైగా కుంటి సాకులతో కప్పి పుచ్చుకోవటం ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం రుజువులు ఆధారాలు లేకపోవటమే. గ్రహాల నుండి మనుషులపై ప్రభావం చూపే ఆధారాలేమీ లేవు. కానీ ఉన్నట్లుగా నమ్మించి, చెప్పి వ్యక్తులను తప్పుదారిన పట్టిస్తున్నారు. ప్రాచీనమైనంత మాత్రాన అదే సరైనదనే ధోరణి నడుస్తున్నది. ముఖ్యంగా భారతదేశంలో ప్రాచీన కాలం నుండి ఎన్నో దోషాలు అమలులో ఉన్నాయి. మంచిని మాత్రమే స్వీకరించి దోషాలను వదిలేయటం అవసరం. ఉదాహరణకు అంటరాని తనం, కులహెచ్చుతగ్గులు, చాలా కాలం నుంచి వస్తున్నాయి. అంతమాత్రాన అవి మంచివని, వాటినే అనుసరించాలని అనలేము. అలాగే జ్యోతిష్యం ప్రాచీన కాలంలో ఎవరో చెప్పారని ఇప్పటికీ మూర్కంగా అనుసరించటం మన జనాన్ని వెనక్కి నడిపించటమే. ఇదే దోరణి విదేశాల్లోనూ ఉన్నది. అక్కడ ఛాలెంజ్ చేసినప్పుడు వారు రుజువులకు ముందుకు రారు. ఇండియాలోనూ అదే ధోరణి ఉన్నది.



ప్రపంచంలో చాలా దేశాలలో జ్యోతిష్య నమ్మకాలు ఉన్నాయి. కానీ భారతీయ జ్యోతిష్యం వాటికి భిన్నంగా, చాలా ప్రత్యేకతలతో ఉన్నది.


భారతీయ జ్యోతిష్యానికి మూలం 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాశులు, 108 పాదాలు, పుట్టుక కాలం.
9 గ్రహాలలో ప్రపంచంలో ఎక్కడా లేని, శాస్త్రీయ ఆధారాలకు అందని రెండు గ్రహాలున్నాయి. ఒకటి రాహువు, కేతువు.


గ్రహాలకి కులాలున్నాయి. అంటరానితనం ఉన్నది. శని శూద్ర కులానికి చెందగా, వైశ్య కులానికి చెందినవారు చంద్రుడు, బుధుడు అట. రాజ వంశానికి చెందినవారు కుజ, రవి కాగా బ్రాహ్మణులలో శుక్రుడు గురువున్నాడు. ఇంతటితో ఆగలేదు. శుక్రుడు, చంద్రుడు స్త్రీ గ్రహాలట. గురుడు, కుజుడు, రవి పురుషులట. శని, బుధుడు నపుంసకులట. ఈ విచక్షణ వర్గీకరణ ప్రపంచంలో మరే జ్యోతిష్యంలోనూ లేదు. వీనికి తోడు ప్రతి గ్రహానికి ఒకళ్ళో ఇద్దరో దేవుళ్ళు కూడా ఉన్నారు. అందుకే గ్రహాలను దేవతలంటారు. పైగా మన జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు గ్రహం. అంతేగాని నక్షత్రం కాదు.
వ్యక్తి భవిష్యత్తును చెప్పటానికి జనన కాలం, లగ్నం ఆధారంగా సూచిస్తారు.


భారతీయ జ్యోతిష్యానికి మూలం ఎక్కడో కచ్చితంగా తేల్చి చెప్పటంలేదు. వేదాలలో జ్యోతిష్యం లేదు. వేదాంగాలలో 6 భాగాలుండగా అందులో జ్యోతిష్యం ఒకటి. ఎక్కువమంది జ్యోతిష్యులు పరాశరహోరా శాస్త్రాన్ని పాటిస్తారు. ఆ తరువాత చిలవలు పలవలుగా చాలా పుస్తకాలు, చాలామంది పండితులు బయల్దేరి అనేక చిట్కా జ్యోతిష్యాలు చెప్పారు. వీటిలో ఉత్తరోత్తర ఖగోళ శాస్త్రంలో కనుగొన్న గ్రహాలు లేవు. నెప్ట్యూన్, యురేనస్ వంటివి వారికి తెలియదు. గ్రహాలకు బలం ఉంటే అవి మనుషుల మీద ప్రభావం చూపితే మరి ఆ గ్రహాల సంగతి ఏమవుతుందో తెలియదు.


గ్రహాల నుండి వెలుగు రాదు. అయినప్పటికీ గ్రహాల ప్రభావం మనిషిమీద ఎలా ఉంటుంది అనేది ప్రాచీన శాస్త్రాల, అంకెల గారడీతో చెప్పటం తప్ప ఋజువుపరచటానికి ఏమీ లేదు. కానీ కొత్త ఎత్తుగడలతో నామ నక్షత్రం పేరిట మొదటి అక్షరాన్ని బట్టి జన్మ లగ్నం చెప్పటం, ప్రశ్న కాలాన్ని బట్టి చెప్పటం అనేవి బతుకు తెరువుకు వేసిన ఎత్తుగడలు మాత్రమే.


ఖగోళ శాస్త్రంలో ఋజువులూ ఆధారాలూ ఉంటాయి. ఆధునిక పరికరాలతో పరికించే తీరు ఉంటుంది. జ్యోతిష్యంలో ప్రాచీన గ్రంథాలు తప్ప మరే పరిశీల, పరిశోధన ఉండదు. గ్రహానికీ, నక్షత్రానికీ తేడా వీరికి తెలియదు. రాశులు అనేవి ఊహించిన రూపాలే తప్ప వాస్తవంలో లేవు. అయినా వాటినే నేటికీ పాటిస్తున్నారు.


జనన కాలాన్ని నిర్ధారించడానికి, తల్లి గర్భంలో బిడ్డ ప్రవేశించినపుడు, ప్రసవించేటప్పుడు తల బయటికి వచ్చినప్పుడు, తొలిసారి బిడ్డ ఏడ్చినప్పుడు, తొలుత శ్వాస పీల్చినప్పుడు లెక్కలు వేస్తున్నారు. ఇవన్నీ అభిప్రాయ భేదాలతో ఉన్న అంశాలే. కచ్చితంగా జన్మ నక్షత్రాన్ని నిర్ణయించే ఆధారాలేవీ వీరికి లేవు. అయితే నమ్మకం, మూఢవిశ్వాసం సంప్రదాయంగా వస్తున్నాయి గనక జ్యోతిష్యం ఒక వ్యాపారంగా సాగిపోతోంది. ఖగోళ శాస్త్రం పక్కన పెట్టుకొని పరిశీలిస్తే జ్యోతిష్యం నిలబడదు. కనకనే దాని జోలికి పోరు. యూనివర్సిటీలలో జ్యోతిష్యం కోర్సులు పెట్టిన చోట కూడా శాస్త్రీయ పరిశీలన, ఖగోళంతో పోల్చి చూడటం అనేవి లేవు. సూర్యుని నుండీ వచ్చే వెలుగు ప్రతి క్షణం అనంత కిరణాలతో ఉంటుంది అందులో ఏ కిరణంతో పుట్టినప్పుడు ప్రభావితం అవుతారో చెప్పలేరు. అయినా లగ్నాలు, ముహుర్తాలు, మంచి గిట్టుబాటు వాణిజ్యంగా చదువుకున్న వారిలో సైతం సాగుతుండటం పేర్కొనదగిన అంశం.

No comments:

Post a Comment