Sunday 16 February 2014

ఉండవల్లి శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం........



గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి అతి ప్రాచీనమైన, చరిత్ర ప్రసిద్ధి చెందిన గ్రామం. విజయవాడ ప్రకాశం బ్యారేజి దాటి మంగళగిరి రహదారి పై కొద్దిగా ముందుకు వెళితే .... ఉండవల్లి సెంటరు వస్తుంది. కుడివైపుకు తిరిగి అమరావతి రోడ్డులో 5 కి.మీ ప్రయాణం చేస్తే మనం ఈ గుహాలయాలను చేరుకుంటాము. వీటిని ఉండవల్లి గుహలు అని పిలుస్తున్నారు. ఈ గుహాలయాలు క్రీ.శ 420 -620 ప్రాంతంలో ఆంధ్రదేశాన్ని పాలించిన విష్ణుకుండినుల కాలం నాటి నిర్మాణాలు గా చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. విష్ణు కుండినులు మొదట్లో బౌద్ధమతానుయాయులుగా అనంతరం హిందూమతాన్ని ప్రోత్సహించినట్లు చరిత్ర చెపుతోంది . ..
ఒకే కొండను నాలుగంతస్తుల గుహాలయాలుగా, విశాలమైన విహారాలుగా మందిరాలుగా, అందమైన స్థంభాలుగా, బౌద్ధ, శైవ, వైష్ణవ దేవతామూర్తులుగా వివిథా కృతులలో మలచిన ఆనాటి శిల్పుల అనన్య శిల్పనైపుణ్యానికి, అనల్పశిల్ప కళా ప్రావీణ్యానికి శిరసువంచి జోహార్లు ప్రతి యాత్రీక భక్తుడు వందనాలు సమర్పించాల్సిందే. శ్రీ అనంతపద్మ నాభుని 20 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని చూడగానే ప్రతిఒక్కరు ఆశ్చర్యంతో అవాక్కయి నిలబడి పోతున్నారు.




మొదటి అంతస్తు :-  

క్రింద భాగం మొదటి అంతస్తులో గుప్తుల,చాళుక్యుల కాలపు శిల్పనిర్మాణం కనిపిస్తుంది. ఇవి అసంపూర్తి గానే ఉన్నాయి. బౌద్ద సన్యాసుల విహారాలుగా ఉండేటట్లు వీటి నిర్మాణం ప్రారంభమైంది. వీనిలో ఒకదానిలోనుండి మరొక దాని లోనికి మార్గము , విశాలమైన తిన్నెల నిర్మాణం ఉంది.

రెండవఅంతస్తు :-
 
రెండవ అంతస్తు లోనికి మెట్లమార్గం ఉంది. దీనిలో త్రిమూర్తుల మందిరాలున్నట్టుగా చెపుతున్నారుగాని ఇప్పుడు అవశేషాలు మాత్రమే మిగిలున్నాయి. గదులుగా . మందిరాలుగా ఉన్న వానికి సన్నని తీగలున్న తలుపులను బిగించారు. అక్కడక్కడా ఏవో ఉన్నట్లు గా భ్రాంతి గా కన్పిస్తున్నాయి కాక ఎక్కడా స్పష్టత లేదు. వేసిన తలుపుల వెనుక చీకట్లో ఏవేవో దేవతామూర్తులను పెకలించిన గుర్తులు స్పష్టాస్పష్టంగా కన్పిస్తాయి.

మూడవ అంతస్తు :-

మూడవ అంతస్థులోనికి వెళ్లడానికి గుహను అందగా తొలిచి మెట్లమార్గాన్ని నిర్మించారు. మెట్లను మలిచిన విధానంలోనే ఈ అంతస్థు ప్రత్యేకతను ప్రకటించారు శిల్పులు. ఈ గుహాలయంలోకి ప్రవేశించడమే ఓ వింత అనుభూతిని కల్గిస్తుంది. రెండు వరుసల స్థంభాల మథ్యలో విశాలమైన మండపము విశ్రాంతిమండపంగా భక్తుల్ని ఆహ్వానిస్తుంది. ఆ స్థంభాలపై దశావ తారాలు, వివిథ దేవతామూర్తుల శిల్పాలు కొలువు తీరి చూడగానే పలకరిస్తున్నట్లుగా ఉంటాయి. ఎడమవైపుకు తిరిగితే వరుసగా కొండను తొలిచి తీర్చిదిద్దిన శిల్పాలు కనువిందు చేస్తాయి. వాటిలో ముందుగా మనల్ని ఆకర్షించేది గణనాయకుడైన వినాయకుని రమణీయ శిల్..




నాభి కమలము నుండి ఉద్భవించిన బ్రహ్రీ :పద్మనాభుని మందిరంలోని సమస్త దృశ్యాన్ని ఒకేసారి మనం చూడగలిగితే, స్వామితో పాటు పద్మోద్భవుడైన బ్రహ్మ, ఆనందంలో సురేశుని కీర్తిస్తున్న దేవతలు, ధ్యానంలో ఉన్న ఋషులు, ఆయుథ పాణులైన అంగరక్షకులు, గగనంలో నర్తిస్తున్న గరుత్మంతుడు ఇదీ దృశ్యం. ఈ అనంత శయనుణ్ణి చూడగానే ఈ శ్లోకం స్భురణ కొస్తుంది :


''శాంతాకారం, భుజగశయనం, పద్మనాభం, సురేశం

విశ్వాకారం, గగనసదృశం, మేఘవర్ణం, శుభాంగం,

లక్ష్మీకాంతం, కమలనయనం, యోగి హృద్ధ్యానగమ్యం

వందే విష్ణుం''
ఈ శ్లోకమే ఈ శిల్పికి ప్రేరకమై,
 శ్రీ అనంతపద్మనాభుని రూపాన్ని భువన మోహనంగా మన ముందు రూపు కట్టించింది

No comments:

Post a Comment