Sunday 16 March 2014

రాజకీయ-ఆర్థికవేత్త మరియు విప్లవ కారుడు:- కార్ల్ హెన్రిక్ మార్క్స్




కార్ల్ హెన్రిక్ మార్క్స్
(మే 5, 1818 - మార్చి 14, 1883) 19వ శతాబ్దానికి చెందిన ఒక ప్రష్యన్ తత్త్వవేత్త, రాజకీయ-ఆర్థికవేత్త మరియు విప్లవ కారుడు.

ఒక మేధావిగా మాత్రమే కాక రాజకీయంగా చాలా క్రియాశీలంగా వ్యవహరించిన మార్క్స్ సామ్యవాద పితామహుడుగా పరిగణింపబడుతున్నాడు. ఈయన అనేక రాజకీయ, సామాజిక సమస్యల మీద దృష్టి సారించినా కూడా ముఖ్యంగా చరిత్రను అధ్యయనం చేసిన విధానం ఈయనకు ఒక విశిష్టతను చేకూర్చినది. ఈయన రచించిన కమ్యూనిష్టు పార్టీ ప్రణాళిక లోని ఈ ప్రారంభవాక్యం చరిత్రను గురించిన ఈయన దృక్పథాన్ని తెలుపుతుంది.



 
వర్తమాన సమాజపు చరిత్రంతా వర్గపోరాటాల చరిత్రే.

'పూర్వ వ్యవస్థల వలెనే పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా తన వినాశనానినికి దారితేసే అంతర్గత వైరుధ్యాలను తనలోనే సృష్టించుకుంటుంది. భూస్వామ్య వ్యవస్థ ఏవిధంగా పెట్టుబడిదారీ వ్యవస్థ ద్వారా తొలగింపబడిందో అలాగే పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా సామ్యవాద వ్యవస్థ ద్వారా తొలగింపబడి రాజ్యం లేని వర్గరహిత సమాజం ఏర్పడుతుంది. కాకపోతే ఈ వర్గరహిత సమాజం అనేది కార్మిక వర్గ నియంతృత్వం అనబడే పరిణామ దశను దాటిన తరువాతనే ఆవిర్భవిస్తుంది' అని మార్క్సు విశ్వసించాడు.

మార్క్స్ తన జీవితకాలములో అంత గుర్తింపు పొందనప్పటికీ, మరణించిన కొద్ది కాలము లోనే కార్మికుల జీవితాలలో ఆతని ఆలోచనలు చాలా ప్రభావాన్ని చూపించడము మొదల్లు పెట్టాయి. రష్యాలో అక్టోబరు విప్లవము దీనికి సహాయ పడినది.

జీవితం


కార్ల్ మార్క్స్ జర్మనీ లోని ట్రీర్ అనే పట్టణంలో ఒక యూదు కుటుంబంలో జన్మించాడు. మార్క్స్ బాన్,బెర్లిన్ మరియు జెనా విశ్వవిద్యాలయాలలో విద్యనభ్యసించాడు.1842 లో మార్క్స్ ఒక పత్రికకు సంపాదకుడుగా పనిచేశాడు. పత్రికా యాజమాన్యంతో వచ్చిన విభేదాలతో 1843 లో మార్క్స్ సంపాదకత్వ బాధ్యతలనుండి తప్పుకుని పారిస్ చేరుకున్నాడు. అక్కడ చరిత్ర ,రాజనీతి శాస్త్రం మరియు తత్వశాస్త్రాలను అభ్యసించటంతో మార్క్స్ లో సామ్యవాద భావాలు రూపుదిద్దుకున్నాయి. మార్క్స్ 1844 లో ఎంగెల్స్ ను పారిస్ లో మొదటిసారి కలిసాడు. భావ సారూప్యత కలిగిన వారిద్దరూ శాస్త్రీయ కమ్యూనిజం యొక్క సైద్దాంతిక సూత్రాలను ఆవిష్కరించటానికి మరియు ఆ సూత్రాల ప్రకారంగా అంతర్జాతీయ కార్మికవర్గ ఉద్యమ నిర్మాణాన్ని చేపట్టటానికి కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు.వారి స్నేహం మార్క్స్ జీవించి ఉన్నంతవరకు అలానే కొనసాగింది.

కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక




1845 లో మార్క్స్ తన విప్లవ కార్య కలాపాల వలన పారిస్ నుండి బహిష్కరించబడ్డాడు.దానితో మార్క్స్ బ్రస్సెల్స్ చేరుకుని అచట మరలా తన విప్లవ కార్యాచరణను ప్రారంభించాడు.

యూరోపియన్ నగరాలన్నింటిలోని విప్లవ సమూహాలన్ని 1847 లో కమ్యూనిస్టు లీగ్ గా ఏకీకృతమయ్యాయి. మార్క్స్ మరియు ఎంగెల్స్ ఈ కమ్యూనిస్టు లీగ్ కు సైద్దాంతిక సూత్రీకరణలను తయారు చేయుటకు నియమింపబడ్డారు. ఎంగెల్స్ సహయంతో మార్క్స్ ఈ బాధ్యతను నిర్వర్తించాడు.అలా రచింపబడినదే చరిత్రలో ఆధునిక సోషలిస్టు సిద్ధాంతం యొక్క మొట్టమొదటి శాస్త్రీయ ప్రకటనగా ప్రసిద్ది చెందిన కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక.

ఈ రచనలో మార్క్స్ చారిత్రక భౌతిక వాద దృక్కోణంలో చరిత్రను వ్యాఖ్యానించాడు.సమాజపు చరిత్రంతా పీడక మరియు పీడిత వర్గాల అంటే పాలక మరియు పాలిత వర్గాల మధ్యన జరిగిన సంఘర్షణల చరిత్రే.ఈ క్రమంలో పెట్టుబడిదారీ వర్గం ప్రపంచ వ్యాప్త కార్మిక వర్గ విప్లవం ద్వారా తొలగింపబడి వర్గరహిత సమాజం ఏర్పడుతుందని ఈ ప్రణాళికలో మార్క్స్ సూత్రీకరించాడు.



లండన్ లో జీవితం


కమ్యూనిష్టు పార్టీ ప్రణాళిక రచనానంతరం తన విప్లవ కార్య కలాపాల వలన యూరప్ లోని అనేక దేశాలు మార్క్స్ ను బహిష్కరించాయి. దానితో మార్క్స్ చివరికి లండన్ చేరుకుని తన మిగిలిన జీవితాన్నంతా అక్కడే గడిపాడు. లండన్ లో మార్క్స్ అధ్యయనానికి,రచనా వ్యాసంగానికి మరియు అంతర్జాతీయ కమ్యూనిష్టు ఉద్యమ నిర్మాణ ప్రయత్నానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. ఈ కాలంలో మార్క్స్ సామ్యవాద సాహిత్యంలో మకుటాయమానమనదగిన ఎన్నో రచనలు చేశాడు. వీటన్నింటి లోకి ప్రధానమైనది దాస్ కాపిటల్. ఈ గ్రంథం లో మార్క్స్ సమాజం లోని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ యొక్క క్రమబద్దమైన మరియు చారిత్రకమైన విశ్లేషణను చేశాడు. ఈ గ్రంథలోనే పెట్టుబడిదారులు శ్రామిక వర్గం సృష్టించే అదనపు విలువ ను దోపిడీ చేసే విధానాన్ని సిద్ధాంతీకరించాడు.ఆ తదనంతరం మార్క్స్ ఫ్రాన్స్ లో 1871 లో నెలకొల్పబడి అతికొద్దికాలం మనగలిగిన పారిస్ కమ్యూన్ అనబడే విప్లవ ప్రభుత్వం గురించి వివరించిన ఫ్రాన్స్ లో అంతర్యుద్దం (ద సివిల్ వార్ ఇన్ ఫ్రాన్స్) అనే గ్రంథం రచించాడు. ఇవే కాక మార్క్స్ ఆకాలంలో ఇంకా అనేక రచనలను చేశాడు.

చివరి రోజులు



1852 లో కమ్యూనిస్టు లీగ్ రద్దవ్వగానే మార్క్స్ అనేక మంది విప్లవకారులతో సంబంధాలు కొనసాగించి చివరకు 1864 లో మొదటి ఇంటర్నేషనల్ అనే విప్లవ సంస్థను లండన్ లో స్థాపించాడు. ఈ సంస్థ కార్యక్రమమంతా మార్క్స్ ఆధ్వర్యంలోనే,అతని మార్గదర్శకత్వంలోనే నడిచేది. కానీ ఈ సంస్థలోని సభ్యులు పారిస్ కమ్యూన్ విప్లవంలో పాల్గొనడం, ఆ విప్లవం క్రూరంగా అణచి వేయబడటంతో మొదటి ఇంటర్నేషనల్ కూడా క్షీణించడంతో దాని కేంద్ర స్థానాన్ని మార్క్స్ అమెరికా కు మార్పించాడు. జీవితంలో ఆఖరి కొద్ది సంవత్సరాలు మార్క్స్ అనేక వ్యాధులతో బాధ పడ్డాడు. అవి అతని రాజకీయ ,రచనా వ్యాసంగానికి ఆటంకంగా పరిణమించాయి.దానితో మార్క్స్ తాను రచించదలచుకున్న వాటిలో కొన్నింటిని రచించలేక పోయి చివరకు లండన్ లోనే మార్చ్ 14,1883 న మరణించాడు.


మార్క్స్ ప్రభావం


మార్క్స్ జీవితకాలంలో అతడి సిద్ధాంతాల ప్రభావం స్వల్పంగానే ఉండేది. ఐతే మరణానంతరం అతని ప్రభావం కార్మికోద్యమం తో పాటు పెరుగుతూవచ్చింది. అతని విధానాలు, సిద్ధాంతాలు, మార్క్సిజం లేక శాస్త్రీయ సామ్యవాదం గా పేరు గాంచాయి. కార్ల్ మార్క్స్ చేసిన పెట్టుబడిదారీ ఆర్థిక విశ్లేషణ మరియు అతడి చారిత్రక భౌతికవాద సిద్ధాంతాలు, వర్గ పోరాటం, అదనపు విలువ, కార్మిక వర్గ నియంతృత్వం మొదలైన సూత్రీకరణలన్నీ కూడా ఆధునిక సామ్యవాద సిద్ధంతానికి పునాదిగా నిలిచాయి. మార్క్స్ సిద్ధాంతాలన్నీ అతడి మరణానంతరం పెక్కు మంది సోషలిష్టులచే పరిశీలించబడినాయి. ఐతే 20 వ శతాబ్దం లో లెనిన్ ఈ సిద్ధాంతాలన్నింటినీ మరింతగా అభివృద్ధి చేసి ఆచరణలోకి తెచ్చాడు.










No comments:

Post a Comment