Tuesday 29 April 2014

సాలార్ జంగ్ మ్యూజియం ఒక కళా సంగ్రహాలయము



సాలార్ జంగ్ మ్యూజియం "దార్-ఉల్-షిఫా" వద్ద గల ఒక కళా సంగ్రహాలయము. హైదరాబాదు నగరంలోని మూసీ నది దక్షిణ ఒడ్డున గలదు. ఇందు "ఏనుగు దంతాల కళాకృతులు", "పాలరాతి శిల్పాలు" గలవు.

చరిత్ర

1951 డిసెంబరు 16 న ఈ సంగ్రహాలయం ప్రజలకొరకు తెరవబడినది; హైదరాబాదుకు చెందిన నిజామ్ పరిపాలకుల "సాలార్ జంగ్ కుటుంబం" ప్రపంచం నలుమూలల నుండి ఎన్నో విలువైన వస్తు సామగ్రి, కళాఖండాలు సేకరించింది. ఇందులో ఇస్లామీయ కళాఖండాలు, ప్రాచీన ఖురాన్ ప్రతులూ, నగలూ, నగిషీలూ, యుద్ధసామగ్రీ, పర్షియా తివాసీలు మొదలగునవి కలవు. ఈ సేకరణలన్నీ దాదాపు మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సేకరించినవే, ఇతను సాలార్ జంగ్ III గా ప్రసిధ్ధి. కొన్ని సేకరణలు ఇతడి తండ్రియైన "మీర్ లయీఖ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ II" మరియు "నవాబ్ మీర్ తురాబ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ I" కు చెందినవి.


సేకరణలు


సాలార్ జంగ్ కు చెందిన నగరమహలులో 78 గదులలో 40,000 వస్తువులు గలవు. ఇందులో ప్రముఖంగా : పరదాలో యున్న "రెబెక్కా", జహాంగీర్ చురకత్తి, నూర్జహాను పండ్లుకోసే కత్తి, 12వ శతాబ్దానికి చెందిన "యాఖూతి ఉల్-మస్తామీ" యొక్క ఖురాన్ ప్రతి, గడియారం మరియు "స్త్రీ-పురుష శిల్పం" ప్రధానమైనవి.

సేకరణల్లో గ్రంధాలు, పోర్సిలీన్, తుపాకులు, ఖడ్గాలు, శిల్పాలు ప్రపంచపు నలుమూలలనుండి తెప్పించి భద్రపరచబడినవి.

భారత పార్లమెంటు, ఈ సంగ్రహాలయాన్ని "జాతీయ ప్రాముఖ్యం" గల సంగ్రహాలయంగా గుర్తించినది.
ఈ మ్యూజియం ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:00 వరకూ సందర్శకులకొరకు తెరవబడి యుంటుంది. (శుక్రవారం శెలవు).


Monday 28 April 2014

నాడు తాగునీరు కి వాడె మన ట్యాంక్ బండ్ నేడు వినాయక నిమరజ్జన్ము కి వాడుతున్నారే....

టాంక్ బండ్

టాంక్ బండ్ (Tank Bund) గా ప్రసిద్ధమైన ఈ రహదారి 1568లో హుస్సేన్‌ సాగర్‌ గట్టుగా నిర్మించబడింది. ఇది చెరువు గట్టుగా ఊంది కాబట్టి, టాంక్ బండ్ (చెరువు గట్టు) గా ప్రసిద్ధి చెందింది. హైదరాబాదు మరియు సికింద్రాబాదు జంట నగరాలను కలుపుతుంది హుస్సేన్‌ సాగర్‌ మీద ఉన్న టాంకు బండ్. ఈ గట్టుమీద నుండి వెళ్ళే ట్యాంక్ బండ్ రహదారికి, జంటనగరాలలో ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. పొద్దున్న పూట వ్యాయామంలో భాగంగా ఉదయం నడక సాగించేవారికి, సాయంకాలం వాహ్యాళికి వెళ్ళేవారికి(ముఖ్యంగా ఆదివారం మరియు ఇతర శెలవు రోజుల సాయంత్ర సమయాలలో), స్నేహితులను కలుసుకొనేవారికి, ఇది ఒక ఇష్టమైన ప్రత్యేక స్థలం.

చరిత్ర

చెరువు గట్టుమీద మార్గంలో పూర్వము చెరువు కనిపించకుండా ఎత్తైన ప్రహరీ గోడలు ఉండేవి. 1946లో ఇది నచ్చని అప్పటి హైదరాబాదు దీవాను సర్ మీర్జా ఇస్మాయిల్ గోడలను కూల్చివేయించి వాటి స్థానంలో ఇనుప కడ్డీలతో కూడిన ప్రాకారాన్ని (రెయిలింగు) ను కట్టించాడు. ఈ విధంగా చెరువు కట్టమీద నడిచే వారికి చల్ల గాలి పీల్చుకుంటూ, చెరువు యొక్క దృశ్యాన్ని అస్వాదించే విధంగా మార్పులు చేశాడు.
మూసీ నది ఉపనది పైన ఈ కట్టను 1562లో ఇబ్రహీమ్ కులీ కుతుబ్‌షా హైదరాబాదు నగరానికి నీటి సరఫరా నిమిత్తం కట్టించాడు. తనను అనారోగ్యంనుండి కోలుకునేలా చేసిన హుస్సేన్ షా వలీ గౌరవార్ధం ఈ చెరువుకు హుస్సేన్ సాగర్ అని పేరు పెట్టాడు. అప్పటికి ఇంకా చరిత్రాత్మకమైన చార్మినార్ నిర్మాణం జరుగలేదు. నిజాం పాలనలో ఉన్న హైదరాబాదు నగరానికి, బ్రిటిష్ వారి అధీనంలో ఉన్న కంటోన్మెంట్‌కు మధ్య రాకపోకలకు ఈ కట్ట ఒక మార్గమయ్యింది.

అందచందాలు

క్రమంగా హుస్సేన్ సాగర్ నీరు త్రాగు నీటి అవసరాలకు పనికిరాకుండా పోయింది. అయితే నగరం విస్తరిస్తున్న కొద్దీ టాంక్‌బండ్ రోడ్డుమీద వాహనాల రద్దీ బాగా పెరిగింది. రోడ్డును అభివృద్ధి పరుస్తూనే వివిధ ప్రభుత్వాలు దానిని, దాని పరిసరాలను సుందరంగా తీర్చి దిద్దారు. పార్కులు, విగ్రహాలు, మందిరాలు, భవనాల సముదాయంతో ఇది నగరంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తున్నది.

బుద్ధ విగ్రహం

 

 

టాంక్‌బండ్ ప్రక్కనున్న హుస్సేన్ సాగర్‌లో 'జిబ్రాల్టర్ రాక్' అనబడే రాతిపైన ఒక పెద్ద బుద్ధ విగ్రహాన్ని అమర్చారు. ఒకే రాతిలో మలచబడిన ఈ విగ్రహం 17.5 అడుగుల ఎత్తు ఉండి 350 టన్నుల బరువుంటుంది. గణపతి స్థపతి నేతృత్వంలో 40 మంది శిల్పులు రెండు సంవత్సరాలు శ్రమించి మలచిన ఈ శిల్పం 60 కి.మీ. దూరంనుండి 192 చక్రాలు గల వాహనంపై ఇక్కడికి తీసుకురాబడింది. అయితే స్థాపన సమయంలో విషాదం చోటు చేసుకొంది. బార్జ్‌తో పాటు విగ్రహం మునిగి కొందరు శ్రామికులు ప్రాణాలు పోగొట్టుకొన్నారు. మళ్ళీ డిసెంబరు 1992లో దీనిని వెలికితీసి ప్రతిష్టించారు. హైదరాబాదు నగర చిహ్నంగా చార్్మినార్‌తో పాటు ఈ విగ్రహాన్ని కూడా పలు సందర్భాలలో చూపుతారు.

33 మహానుభావుల విగ్రహాలు

నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఈ రోడ్డుపై 33 విగ్రహాలు నెలకొల్పబడ్డాయి. ఈ 33 మంది వ్యక్తులు ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర, సంస్కృతి, సాహిత్యాలలో విశిష్టమైన స్థానం కలిగిన మహనీయులు. వారి చిత్రాలన్నిటిని, ఈ వ్యాసం చివర ఉన్న దృశ్య మాలికలో చూడవచ్చు. ఈ విగ్రహాలు ఏర్పరచే సమయంలో, మరికొంతమంది విశిష్ట వ్యక్తుల విగ్రహాలు ఏర్పరచలేదని కొంత వివాదం ఏర్పడింది. ముఖ్యంగా, జ్ఞానపీఠ బహుమతి గ్రహీత, వేయు పడగలు, రామాయణ కల్పవృక్షం వంటి కావ్యాలను రచించిన విశ్వనాధ సత్యనారాయణ విగ్రహం, తన కవితలతో, పాటలతో తెలుగువారిని వెన్నలస్నానాలు చేయించిన దాశరథిగారి విగ్రహం, అపర చాణక్యుడుగా పేరుగాంచిన తెలుగు ప్రధాని పి.వి నరసింహారావుగారి విగ్రహాలు ఇక్కడ ఏర్పరచకపోవటం ఒక లోపంగా ఇప్పటికీ సాహితీ అభిమానులు బాధపడుతుంటారు. చిత్రమాలికలో చూపినట్టుగా విగ్రహాలఅన్నింటిలో కొన్ని నేడు లేవు..... విచిత్రమేమిటంటే రాజకీయాలతో, ఉద్యమాలతో, వివాదాలతో, ప్రాంతాలతో సంబంధంలేని మొత్తం తెలుగువారందరికీ చెందిన అన్నివిగ్రహాలలో కొన్ని తెలుగువారిచేతనే కూల్చబడి, పగలగొట్టబడి, తగలబెట్టబడి, విరగ్గొట్టబడి, తొక్కబడి హుసేన్ సాగర్ లో విసిరివేయబడటం...

టాంకు బండ్ పరిసరాలు

సరస్సుకు టాంక్‌బండ్ ఒక కట్ట కాగా రెండవప్రక్క నెక్‌లేస్ రోడ్, ఐ-మాక్స్ థియేటర్, ఎన్.టి.ఆర్. ఉద్యానవనం శోభాయమానంగా వృద్ధి చెందాయి. సెక్రటేరియట్ భవనం, పెద్ద ఫ్లై ఓవర్, బోట్ క్లబ్, లుంబిని పార్కు ఇక్కడికి సమీపంలోనే ఉన్నాయి. ఉత్తరాన సంజీవయ్య పార్కు, హజరత్ సైదాని మా సాహెబా సమాధి ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి టాంక్‌బండ్‌కు సమాంతరంగా దిగువ టాంక్‌బండ్ రోడ్ వేశారు. ఇది ప్రస్తుతం పత్రిక, టెలివిజన్ కార్యాలయాల కేంద్రంగా విలసిల్లుతున్నది. ఈ దిగువ టాంక్‌బండ్ రోడ్డు దక్షిణాన కట్ట మైసమ్మ గుడి, దాని సమీపంలో ఇందిరా పార్కు ఉన్నాయి. ఇలా టాంక్‌బండ్ ప్రస్తుతం హైదరాబాదు సికందరాబాదు నగరాలలో ముఖ్యమైన ప్రయాణ మార్గంగానూ, పర్యాటక స్థలంగానూ ఉన్నది.

టాంక్ బండ్‌పై జరిగే ఉత్సవాలు

గణేశ విగ్రహాల నిమజ్జనం

ప్తి సంవత్సరం వినాయక చవితి అనంతరం హుస్సేన్ సాగర్‌లో గణేశ విగ్రహాల నిమజ్జనం జంటనగరాలలో ఒక ముఖ్యమైన వార్షిక సంరంభంగా పరిణమించింది.దీనివల్ల, ఈ సరస్సును "వినాయక్ సాగర్" గా కూడ కొంతమంది పిలవటం పరిపాటయ్యింది. కోలాహలంగా, అనేక వాహనాలలో, వివిధ సైజులలో వినాయకులు ఊరేగింపుగా తెచ్చి సరస్సులో నిమజ్జనం చేస్తారు. ఏటా దాదాపుగా 30,000 పైగా విగ్రహాలు ఇలా నిమజ్జనం చేయబడుతాయని అంచనా. ట్రాపిక్ సమస్యలను నియంత్రించడానికి, మతపరమైన కల్లోలాలు తలెత్తకుండా ఉండడానికి నగర పాలక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం పెద్దయెత్తున ఏర్పాట్లు చేస్తారు. బందోబస్తు కోసం 30,000 పైగా పోలీసు బలగం ఈ సమయంలో విధి నిర్వహరణలో ఉంటారు. విగ్రహాల సంఖ్యను, ఊరేగింపు రూట్లను, నిమజ్జనా కార్యకలాపాలను పర్యవేక్షించి తగు చర్యలు తీసుకోవడానికి ప్రణాళిక కోసం ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నారు. నిమజ్జనం జరిగిన మర్నాడు చూస్తే, అంతకుముందువరకు ఎన్నో పూజలందుకున్న విగ్రహాల మీదకెక్కి వాటిని పగులగొట్టి వాటిల్లో అమర్చిన ఇనప చువ్వలు తీసుకుపోతున్నవారు కనిపిస్తారు. చివరకు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ముక్కలుగా మారిన ఆ విగ్రహాలు నీటిలో మిగిలిపోతాయి.ఈ విధంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేయబడి, రసాయనిక రంగులు పూయబడిన విగ్రహాలను ఇంత పెద్ద యెత్తున నిమజ్జనం చేయడం వల్ల సరస్సు నీరు కలుషితమౌతుందని పర్యావరణ పరిరక్షణావాదులు హెచ్చరిస్తున్నారు.  విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో కాకుండా మట్టితో చేస్తే పర్యావరణం మీద ప్రభావం చాలావరకు తగ్గించవచ్చని, నిపుణుల అభిప్రాయం.

 

 

 

 

 

 

 

Saturday 26 April 2014

"గొల్ల కొండ" నుండి గోల్కొండ కోటగా అవతరించిన......చరిత్ర




"గొల్ల కొండ" నుండి గోల్కొండ కోటగా రూపాంతరం చెందిన ఈ ప్రాకారం వెనుక ఒక ఆసక్తికరమయిన కథనం ఉంది. అదేమిటంటే 1143 లో మంగళవరం అనే రాళ్ళ గుట్ట పైన ఒక గొడ్లకాపరికి ఒక దేవతా విగ్రహము కనిపించినది. ఈ వార్త అప్పటి ఆ ప్రాంతమును పాలించే కాకతీయులకు చేరవేయ బడినది. వెంటనే ఆ పవిత్ర స్థలములో రాజుగారు ఒక మట్టి కట్టడమును నిర్మించారు. కాకతీయులకు, వారి వారసులు ముసునూరి నాయకులకు గోల్కొండ ఓరుగంటి సామ్రాజ్యములో ముఖ్యమైన కోట. గోల్కొండ కోట తొలుతగా 1323లో ఘియాసుద్దీన్ తుగ్లక్ కుమారుడు ఉలుఘ్ ఖాన్ వశమయ్యింది. పిదప ముసునూరి నాయకులు విప్లవముతో ఓరుగల్లుతో బాటు గోల్కొండ కూడ విముక్తము చేయబడినది. 1347లో గుల్బర్గ్గా రాజధానిగా వెలసిన బహమనీ రాజ్యమునకు ముసునూరి వారికి పెక్కు సంఘర్షణలు జరిగాయి. మహమ్మద్ షా కాలములో ముసునూరి కాపానీడు కౌలాస్ కోటను తిరిగి సాధించుటకు తన కొడుకు వినాయక దేవుని పంపుతాడు. కాని వినాయక దేవ ఈ ప్రయత్నములో విఫలుడవుతాడు. 1371లో పారశీక అశ్వముల కొనుగోలు విషయములో వచ్చిన తగాదా ఫలితముగా మహమ్మద్ షా వెలమపట్టణముపై దాడి చేసి వినాయక దేవుని బంధించి ఆతనిని ఘాతుకముగా వధించుతాడు. గుల్బర్గాకు తిరిగిపోవు దారిలో మహమ్మద్ షా సైనికులను ఓరుగంటి వీరులు మట్టుబెడతారు. సుల్తాను కూడ తీవ్రముగా గాయపడతాడు. ప్రతీకారముతో రగిలిన సుల్తాను పెద్ద సైన్యమును కూడగట్టి కాపానీడిపై యుద్ధమునకు తలపడతాడు. ఓరుగంటికి విజయనగర సహాయము అందలేదు. కాపానీడు ఢిల్లీ సుల్తాను సహాయము కోరతాడు. తోటి మహమ్మదీయునిపై యుద్ధము చేయుటకు ఢిల్లీ సుల్తాను నిరాకరిస్తాడు. బలహీనపడిన కాపానీడు షా తో సంధిచేసుకుంటాడు. 300ఏనుగులు, 200 గుర్రాలు, 33 లక్షల రూప్యములతో బాటు గోల్కొండ శాశ్వతముగా వదలుకుంటాడు. గోల్కొండ కోటకు అజీమ్ హుమయూన్ అధిపతిగా చేసి షా గుల్బర్గాకు మరలుతాడు. ఈ విధముగా 1371లో గోల్కొండ కోట హిందువులనుండి చేజారి పోయింది.


1507 నుండి మొదలుకొని ఒక 62 సంవత్సరముల కాలములో గోల్కొండ కోటను కుతుబ్ షాహీ వంశస్తులు నల్లరాతి కోటగా తయారు చేశారు. కోట బురుజులతో సహా ఇది 5 కి.మీ. చుట్టుకొలత కలిగి ఉన్నది. గోల్కొండలో కుతుబ్ షాహీ వంశస్తుల పాలన 1687 లో ఔరంగజేబు విజయముతో అంతమయినది. ఆసమయములో ఔరంగజేబు కోటను నాశనంచేశాడు. గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ఎంతో ఖ్యాతి సంపాదించింది. ప్రపంచప్రసిద్దమైన కోహినూరు వజ్రము, పిట్ వజ్రము, హోప్ వజ్రము, ఓర్లాఫ్ వజ్రము ఈ రాజ్యములోని పరిటాల-కొల్లూరు గనుల నుండి వచ్చాయి. గోల్కొండ గనుల నుండి వచ్చిన ధనము, వజ్రాలు నిజాము చక్రవర్తులను సుసంపన్నం చేశాయి. నిజాములు మొగలు చక్రవర్తులనుండి స్వాతంత్ర్యము పొందిన తరువాత హైదరాబాదును 1724 నుండి 1948 లో భారత్‌లో విలీనమయ్యేంతవరకు పాలించారు.


కోటలు

గోల్కొండ నాలుగు వేర్వేరు కోటలు, 87 అర్ధ చంద్రాకారపు బురుజులతోకూడిన 10 కి.మీ. పొడవు గోడ కలిగి ఉంది; కొన్ని బురుజులలో ఇంకా ఫిరంగులను నిలిపిఉంచారు. ఇంకా 8 సింహద్వారములు, 4 ఎత్తగలిగే వంతెనలు (draw bridge), బోలెడన్ని రాచమందిరాలు, మసీదులు, గుళ్ళు, అశ్వశాలలు మొదలగునవి చాలా ఉండేవి. సింహద్వారములలో అన్నిటికంటే కిందది మరియు అన్నిటికంటే బయట ఉండే ఫతే దర్వాజా (విజయ ద్వారము) నుండే మనము గోల్కొండ కోటను చూడటానికి వెళ్తాము. ఔరంగజేబు విజయము తరువాత ఈ ద్వారము గుండానే తన సైన్యమును నడిపించాడు. ఏనుగుల రాకను ఆడ్డుకోవటానికి ఆగ్నేయము వైపున పెద్ద పెద్ద ఇనుప సువ్వలు ఏర్పాటు చేసారు. ఫతే దర్వాజా నిర్మించటానికి ధ్వనిశాస్త్రమును ఔపోసన పట్టినట్లున్నారు. గుమ్మటం కింద ఒక నిర్ణీత ప్రదేశమునందు చప్పట్లు కొడితే కిలోమీటరు ఆవల గోల్కొండలో అతి ఎత్తయిన ప్రదేశములో ఉన్న "బాలా హిస్సారు" వద్ద చాలా స్పస్టముగా వినిపిస్తుంది. ఈ విశేషమును ఒకప్పుడు ఇక్కడి నిర్వాసితులు ప్రమాదసంకేతములు తెలుపుటకు ఉపయోగించేవారు. ఇప్పుడు మాత్రం సందర్శకులకు వినోదం పంచేదిగా మిగిలిపోయింది.

బాలా హిస్సారు దర్వాజా 

 

అన్ని ముఖద్వారములలోకి బాలా హిస్సారు దర్వాజా చాలా మనోహరమయినది. ఆర్చీల మూల ఖాళీలలో ఉన్న సన్నటి రాతి పలకల మీద కాల్పనిక మృగాలు మరియు సింహపు బొమ్మలు ఈ రక్షణ ద్వారమునకు ప్రత్యేక అలంకారాలు. బాలా హిస్సారు దర్వాజా నుండి కొండపైకి వెళ్ళటానికి 380 ఎగుడు దిగుడు రాతిమెట్లు ఉంటాయి. ఆ మెట్లు అన్నీ ఎక్కిన తరువాత మనకు బాలా హిస్సారు బారాదరీ అని పిలవబడే ఒక మంటపము కనిపించును. దర్బారు హాలుగా ఉపయోగించే ఈ కట్టడములో 12 ఆర్చీలు, 3 అంతస్తులు ఉన్నాయి. దానిని వంపు తిరిగిన గదులుగా దృడమయిన స్థంబాలతో విభజించినారు. ఎత్తులో ఉన్న ఒక గదికి ఆనుకొని ఉన్న మూడు ఆర్చీలద్వారా వెనుక ద్వారము తెరుచుకొనును. ఒక ఎత్తయిన మిద్దెపైన మనకు రాతి సింహాసనము కనిపించును. కొండలలో విసిరేసినట్లున్న ఈ మంటపములో అబుల్ హసన్ లు తమ ఉంపుడుగత్తెలను ఉంచేవారని చాలామంది నమ్మకము. బారాదరీలో మనకు మరో విశిష్టత కనిపిస్తుంది - జంట గోడల మధ్య ఉన్న ఖాళీలు గాలిని పీల్చి, పీడనం పెరిగేటట్లుగా గదిలోనికి వదులుతూ, సహజసిద్ధమయిన కూలరు వలె ఉంటుంది.

 

దేవాలయములు మసీదులు 


దస్త్రం:Golkonda (4).jpg
దస్త్రం:Golkonda (2).jpg

హిందూ ఉద్యోగులలో ముఖ్యులయిన అక్కన్న మాదన్నల కార్యాలయములు పైన ఉన్న కుతుబ్ షాహీ దర్బారులో ఉంటాయి. అక్కడ మనము గండశిల నుండి నిర్మించిన కాకతీయుల కాలమునాటి హిందూ దేవాలయమును కూడా చూడవచ్చు. దీనిని మాదన్న దేవాలయముగా సంబోదిస్తారు. అందులో రంగులలో చిత్రించిన కాళీదేవి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఇంకో ముఖ్య కట్టడము "తారామతి" నిర్మించిన మసీదు. ఆక్కడి గండశిలల గుండా నడుస్తున్నప్పుడు మనకు బంకమట్టితో తయారుచేసిన గొట్టాలు కనిపిస్తాయి. కొండపైకి నీటి సరఫరా కోసం అప్పటి సమర్ధవంతమయిన ఏర్పాట్లకు ఇవి సాక్ష్యాలు.


1518లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా కటించిన మసీదు మూలలలో ఉండే మినారుల వలన చాలా బాగా కనిపిస్తుంది. మసీదు ప్రాంగణం కోట బురుజుల వరకు విస్తరించి ఉన్నది. మసీదుకు దగ్గరలోనే గండశిలలో ఒక చిన్న రామ మందిరము ఉన్నది. అబుల్ హసన్ తానాషా సంస్థానంలో కోశాధికారిగా పనిచేస్తున్న రామదాసును, డబ్బులు దుర్వినియోగ పరిచిన నేరంపై ఇక్కడే బంధించాడు. అప్పుడే ఆయన ఇక్కడ రాళ్ళపైన రాముడు, లక్ష్మణుడు మరియు
హనుమంతుల రూపాలను చెక్కాడు.


రాచమందిరాలు

ఏటవాలుగా, ఇరుకుగా ఉన్న మెట్లు కింద ఉన్న జనానాకు మరియు రాణీగారి మహలుకు దారితీయును. అక్కడి రాచమందిరాలు, పెద్ద పెద్ద మిట్టలమీద కట్టారు, వాటికి ఎత్తయిన పైకప్పులు ఉన్నాయి, గోడలన్నీ అలంకార వస్తువులతో నింపి పొదరిల్లులు మరియు చూరులు పర్శియను తరహా రూపకల్పనతో ఎంతో అందముగా తీర్చిదిద్దారు. ఆర్చీల మూలలలో సన్నటి పలకలపై నాజూకు ఆకృతులు మరింత శోభను తెచ్చిపెడుతుంది. రాణీ మహలులో ఉండే ఈ విశేష భోహములను చూసి నాటి మొగలులే అసూయచెందేవారు.

దర్బారు హాలు నుండి కొండపాదమున ఉండే ఒక రాచమందిరమునకు దారి చూపే రహస్య సొరంగ మార్గము ఉండేదని ఒక అభిప్రాయము. ఇస్లాముమత వాస్తుశాస్త్రము ఆధారముగా నిర్మించిన కుతుబ్ షాహీ నవాబుల సమాధులు గోల్కొండకు ఉత్తర దిక్కులో బయట గోడకు 1 కి.మీ. దూరమున నిర్మించారు. ఈ సమాధుల చుట్టూ వనములు, వాటి మధ్య అందమయిన రాతి శిల్పాలు ఉన్నాయి.


కోట బయట రెండు వెర్వేరు మంటపాలను బండరాళ్ళతో నిర్మించారు. వాటిని తారామతి మందిరము మరియు ప్రేమతి మందిరము అని పెలిచేవారు. వీటిలో అక్కాచెళ్ళెలయిన తారామతి మరియు ప్రేమతి నివసించేవారు. వారు రెండంతస్తుల పైన ఒక వృత్తాకారపు వేదికపై తమ ప్రదర్శనలు ఇచ్చేవారు. దానిని కళామందిరమని పిచేవారు. దానిని గోల్కొండ కోట పైన ఉన్న రాజుగారి దర్బారునుండి తిలకించవచ్చు.








Friday 25 April 2014

భాగ్యనగరం ఎలా వెలసింది? ఛార్మినార్‌ పుట్టుకకి సజీవ సాక్ష్యం ఏమిటి?



భాగ్యనగరం ఎలా వెలసింది? ఛార్మినార్‌ పుట్టుకకి సజీవ సాక్ష్యం ఏమిటి? నాడు దక్కన్‌ పీఠభూమిని పాలించిన కుతుబ్‌ షాహి వంశంలో సాగిన అపురూప ప్రేమకథ ఏమిటి? .కుతుబ్‌షా మదిలో భాగమతికి స్థానం దక్కింది కాని గోల్కొండ కోటలో లభించలేదు.......
ఆ కాలంలో భాగ్యనగరిని ఏలిన ఇబ్రహీం కుతుబ్‌ షా కుమారుడు యువరాజు కులీ తన సంస్థానంలోని అద్భుత సౌందర్యరాశి, నర్తకి..భాగమతిని ప్రేమించాడు. ప్రేమకానుకగా తను పాలిస్తున్న నగరానికి ఆమె పేరునే పెట్టాడు. చరిత్రలో ఇదో విజయవంతమైన కథ.అయితే భాగమతి పేరును కులీ కుతుబ్‌షా హైదర్‌గా మార్చివేశారు. రహ్మత్‌నగర్‌లో పురాతన సమాధి భాగమతిదని నిపుణులు నిర్ధారించారు.


ఇబ్రహీం కుతుబ్‌షా కుమారుడు మహ్మద్ కులీ కుతుబ్‌షా 4 ఏప్రిల్ 1566లో జన్మించారు. యుక్త వయస్సులో గుర్రపు స్వారీ చేస్తూ మూసీ నది ప్రవాహాన్ని దాటి ఆవైపున సమీపంలోని చెంచలం గ్రామంలోని భాగమతిని కలుసుకుని ప్రేమాయణం సాగించినట్టు చరిత్ర కారులు చెబుతున్నారు. వర్షాకాలంలో నదీ ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పటికీ మహ్మద్ కులీ మూసీలో ఈదుతూ ప్రేయసి భాగమతిని కలుసుకోవడాన్ని తెలుసుకున్న తండ్రి గోల్కొండ పాదుషా ఇబ్రహీం కుతుబ్‌షా మూసీ నదిపై అప్పట్లో సుమారు లక్ష రూపాయల తో 1578లో పూలే నర్వా పేరుతో (పురానాపూల్) వంతెన నిర్మించారు. సుమారు రెండున్నరేళ్ల పాటు నిర్మాణ పనులు జరిగాయి. పురానాపూల్ నిర్మించే కాలానికి మహ్మద్ కులీ వయసు 12 ఏళ్లు. ఈ వయసులో ఆయన ప్రేమలో పడినట్టు, భాగమతి అనే యువతితో ప్రేమాయణం కొనసాగించినట్టు చెబుతున్న కథనాలను ఆధునిక చరిత్రకారులు కొట్టివేస్తున్నారు. ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలోనే గోల్కొండలో జనసామర్థ్యం సుమారు 70వేలకు పైగా పెరిగిందని, అక్కడ మంచినీటి వసతి సమస్యలు ఉత్పన్నమయ్యాయని కలరా వంటి రోగాలు వ్యాపించడంతో కొత్త నగరానికి శ్రీకారం చుట్టాలనే ప్రతిపాదనలు వచ్చినట్టు చరిత్ర కారులు పేర్కొంటున్నారు. ఇబ్రహీం కుతుబ్‌షా నగర విస్తరణ పనుల్లో భాగంగా 1578లో మూసీపై వంతెన నిర్మించారంటున్నారు. అయితే మూసీ నదిలో ఈదుతూ తన కుమారుడు మహ్మద్ కులీ 1580లో ఇబ్రహీం కుతుబ్‌షా మరణానంతరం మహ్మద్ కులీ అధికారం చేపట్టారు. గోల్కొండ కోట జన సమర్ధంగా మారడంతో మూసీ నదికి దక్షిణ భాగంలో కొత్త నగరానికి రూపకల్పన చేసి 1591లో చార్మినార్‌తో శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత 1594లో బాద్‌షాహి అషూర్‌ఖానాను నిర్మించారు. నగరంలోని మూడు చోట్ల హైదర్‌మహల్ పేరుతో రాజమందిరాలను నిర్మించారు.
ఈ మందిరాల ఆనవాళ్లు లేక పోయినా చరిత్రలో హైదర్‌మహల్ నిర్మాణాలుండేవని చరిత్రకారులు విశ్వసిస్తున్నారు. షియా సంప్రదాయాన్ని ఆచరించిన మహ్మద్ కులీ కుతుబ్‌షా చార్మినార్ నిర్మాణంలో పంజా నగిషీలను ఏర్పాటు చేయించారు. కులీ కుతుబ్‌షా సొంతంగా పర్షియన్‌లో రాసుకున్న పద్యంలో తన 37 మంది ప్రేయసిల పేర్లను గుర్తు చేశారు. ఇందులో భాగమతి పేరు లేక పోవడం గమనార్హం